
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్, వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజామ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. ఇంగ్లండ్తో మంగళవారం అర్థరాత్రి జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 158) సెంచరీతో కదం తొక్కాడు. పాక్ కెప్టెన్కు ఇది కెరీర్లో 14వ సెంచరీ. 81 ఇన్నింగ్స్ల్లో బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ జాబితాలోని హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్లు), డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్లు), విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్లు)లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్ కూడా బాబరే టాప్లో నిలిచాడు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ 82 ఇన్నింగ్స్ల్లో 14 సెంచరీలు బాదగా.. ఆమెను కూడా బాబర్ అధిగమించాడు.
ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ మార్క్ను 72 బంతుల్లో అందుకున్న బాబర్.. రెండోది 32 బంతుల్లో మూడోది 30 బంతుల్లోనే పూర్తి చేశాడు. దాంతో వన్డేల్లో 150కిపైగా పరుగులు చేసిన తొలి పాకిస్థాన్ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. బాబర్ సూపర్ ఇన్నింగ్స్ స్టేడియంలో ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అతను ఔటై క్రీజును వీడుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో అభినందించారు. అయితే బాబర్ శతకంతో చెలరేగిన పాక్కు పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్మన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 11 ఫోర్లతో 102) సూపర్ సెంచరీతో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను 3-0తో ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. బాబర్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. రిజ్వాన్తో కలిసి 179 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన బాబర్.. ఇమామ్తో 92 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పర్కిన్సన్ ఓ వికెట్ తీశాడు.