ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్లో భారత అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రే సెంచరీతో చెలరేగాడు. శనివారం బెకెన్హమ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత అండర్ 19 జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. యూత్ వన్డే సిరీస్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(14).. సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
వైభవ్ విఫలమైనా.. విహాన్ మల్హోత్రా(67)తో కలిసి ఆయుష్ మాత్రే జట్టును ఆదుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ఆయుష్ మాత్రే 115 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. విహాన్ మల్హోత్రాతో కలిసి రెండో వికెట్కు 173 పరుగులు జోడించాడు. విహాన్ మల్హోత్ర(67) శతకం చేజార్చుకోగా.. అభిజ్ఞాన్ కుందు(76 బ్యాటింగ్), రాహుల్ కుమార్(75 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతున్నారు. 63 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత అండర్ 19 జట్టు 4 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్(2/29), ఆర్చీ వాన్(2/88) రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఐపీఎల్ 2025 సీజన్తో ప్రోఫెషనల్ క్రికెట్ కెరీర్ను ప్రారంభించిన ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ తమ ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఫియర్లెస్ గేమ్తో అభిమానులను అలరించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆయుష్ మాత్రే.. రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించారు.