న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేతి వేల గాయంతో తదుపరి మ్యాచ్లు ఆడటంపై సందేహం నెలకొంది. బుధవారం నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు.
అతని బౌలింగ్లో డారిల్ మిచెల్ భారీ షాట్ కొట్టగా.. అక్షర్ పటేల్ రిటర్న్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని ఎడమచేతి చూపుడువేలి చివరికి బలంగా తగిలింది. దాంతో రక్త స్రావమైంది. నొప్పితో విలవిలలాడిన అక్షర్ పటేల్ బౌలింగ్ మధ్యలోనే ఆపేసి ఫిజియోల సాయంతో బయటకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో రవి బిష్ణోయ్ సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్కు వచ్చాడు. అక్షర్ పటేల్ ఓవర్లో మిగిలిన మూడు బంతులను అభిషేక్ శర్మ వేసాడు.

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు వైస్ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ గాయపడటం టీమిండియాకు ఆందోళనగా మారింది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా అక్షర్ పటేల్ కూడా ఈ జాబితాలో చేరడంతో టీమ్మేనేజ్మెంట్కు పెద్ద టెన్షన్ పట్టుకుంది. అక్షర్ పటేల్ స్థానాన్ని భర్తీ చేసే స్పిన్ ఆల్రౌండర్ ఎవరూ లేరు.
అయితే ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి అక్షర్ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించలేదు. గాయం పెద్దది కాకుంటే అతను తదుపరి మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. ముందస్తు చర్యల్లో భాగంగా తదుపరి మ్యాచ్ల నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల అక్షర్ పటేల్.. టీమిండియాకు కీలకమైన ఆటగాడు. అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇస్తే అతని స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్లో భారత్ 238 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 190 పరుగులకు ఆలౌటై 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనుంది.