పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్ తమ పతనాన్ని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన అక్షర్ పటేల్.. తమ లక్ష్యానికి 10-15 పరుగులు తక్కువగా చేయడంతోనే ఓటమిపాలయ్యామని చెప్పాడు. ఫీల్డింగ్లో కీలక క్యాచ్లు వదిలేయడం కూడా తమ పతనాన్ని శాసించిందన్నాడు.
'మా లక్ష్యానికి 10-15 పరుగులు తక్కువగా చేశాం. ఫస్ట్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ చాలా కఠినంగా అనిపించింది. కానీ డ్యూ రావడంతో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఈజీ అయ్యింది. మేం కొన్ని క్యాచ్లు వదిలేశాం. ఆ క్యాచ్లు పట్టాల్సింది. మా ఇంటెంట్లో ఎలాంటి తేడా లేదు. కానీ వికెట్ టూ పేస్డ్గా ఉంది. డ్యూ రావడంతో ఈజీ అయ్యింది. మేం ఇంకా విభిన్నంగా ప్రయత్నించాలని అనుకోవడం లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. మిడిల్ ఓవర్లలో ఒక్క బ్యాటర్ అయినా కాస్త క్రీజులో సెట్ అయ్యి ఉంటే.. ఆ తర్వాత దూకుడుగా ఆడి పరుగులు చేసేందుకు వీలు ఉండేది. అప్పుడు మాకు 10-15 పరుగులు ఎక్కువగా వచ్చేవి.

కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతుండటంతోనే నేను డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్కు వచ్చాను. రాహుల్ను నెంబర్ 4లో ఆడించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మైదానంలో ఒకవైపు గ్రౌండ్ చిన్నగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలనే రాహుల్ను అప్ది ఆర్డర్ ఆడించాం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41), ట్రిస్టన్ స్టబ్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కృనాల్ పాండ్యా(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 119 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. చమీర ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.