టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ కోసమే తాను లెక్కలు చేశానని ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ శతకంతో చెలరేగడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీకి చివర్లో అక్షర్ పటేల్ సహకరించాడు. ఎలాంటి బౌండరీలు కొట్టకుండా సింగిల్స్తో అతనికి ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఓ దశలో కోహ్లీ శతకం అసాధ్యమనిపించింది. కానీ అక్షర్ పటేల్.. సింగిల్స్తో కోహ్లీ శతకం చేసుకునేలా ప్రోత్సహించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ను విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్తో నడిపించాడు. రోహిత్ శర్మ త్వరగానే ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ.. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు రిస్కీ షాట్స్ ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసి సెంచరీ దిశగా సాగాడు.
అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ కావాల్సిన పరుగుల కంటే భారత విజయ సమీకరణం తక్కువగా ఉండటంతో శతకం అసాధ్యమనిపించింది. ఓ దశలో కోహ్లీ కూడా సెంచరీ చేయడం కుదురదని భావించాడు. ముఖ్యంగా కుష్దీల్ వేసిన 43వ ఓవర్లో భారత్ విజయానికి 4 పరుగులు అవసరమవ్వగా.. కోహ్లీ సింగిల్ తీసాడు. రెండో బంతికి అక్షర్ పటేల్ మళ్లీ సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వడంతో షాక్ అయ్యాడు. అక్షర్ వైపు చూడగా.. నవ్వుతూ సెంచరీ చేసుకోవాలని సూచించాడు. ఆ మరుసటి బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ సెంచరీతో పాటు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
కోహ్లీ శతకంపై స్పందించిన అక్షర్ పటేల్.. తొలిసారి తాను లెక్కలు చేసినట్లు తెలిపి నవ్వులు పూయించాడు. 'చివర్లో కోహ్లీ సెంచరీ కోసం నేను కూడా లెక్కలు చేశాను. నేను ఆడేటప్పుడు బంతి ఎడ్జ్ కావద్దని కోరుకున్నా. కోహ్లీ శతకం చాలా సరదాగా అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి హై ప్రెజర్ గేమ్ చూడటం ఇదే తొలిసారి. అందులో విరాట్ భయ్యా సెంచరీ చేయడం ప్రత్యేక అనుభూతినిచ్చింది.ఈ మ్యాచ్ చాలా సరదాగా అనిపించింది. 50 ఓవర్ల ఫీల్డింగ్ తర్వాత కూడా విరాట్ కోహ్లీ వికెట్ల మధ్య పరుగెత్తిన తీరు అతని ఫిట్నెస్కు నిదర్శనం'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.