సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో తాను రాంగ్ టైమ్లో ఔటై ఘోర తప్పిదం చేశానని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ విజయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అక్షర్ పటేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బ్యాటింగ్లో రాంగ్ టైమ్లో ఔటయ్యానని తెలిపాడు. బౌలింగ్లో ధారళంగా పరుగులుచ్చినా కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు.

'నేను రాంగ్ టైమ్లో ఔటయ్యాను. అది నేను చేసిన ఘోర తప్పిదం. నేను ఆ సమయంలో అప్రమత్తంగా లేను. దాంతో కీలక సమయంలో ఔటవ్వడంతో నాపై నాకే కోపం వచ్చింది. నేను హిట్టింగ్ చేయగా.. మరో ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. దూకుడుగా ఆడి మూడు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే వికెట్ కోల్పోయా.
హెన్రీచ్ క్లాసెన్ ధాటికి ఓకే ఓవర్లో 24 పరుగులిచ్చుకున్నాను. ఆ ఓవర్ పూర్తయిన తర్వాత ఐదు సెకన్లపాటు ఏం అర్థం కాలేదు. దాంతో ఎంతో నిరుత్సాహానికి గురయ్యాను. ఈ మ్యాచ్లో ఓటమి ఖాయం అనుకున్నాం. కానీ తిరిగి పుంజుకుంటామని నా అంతరాత్మ చెప్పింది. అప్పుడు రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి.. నా భుజం తట్టాడు. బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నాడు.
ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇంకా మ్యాచ్ ముగియలేదని చెప్పాడు. మాములు ద్వైపాక్షిక సిరీస్లా ఈ హిట్టింగ్కు మేం నిరాశ చెందలేదు. మ్యాచ్పై ఆశలు వదులుకుంటాం. కానీ, మేం ఫైనల్లో అలా చేయలేదు. ఓటమిని అంగీకరించడానికి సిద్దపడలేదు. మ్యాచ్ను ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లాలని భావించాం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఫైనల్లో 34 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోవడంతో అక్షర్ పటేల్ను అప్ది ఆర్డర్ ప్రమోట్ చేయగా.. అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో హెన్రీచ్ క్లాసెన్ ధాటికి ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్ సంచలన విజయాన్ని అందుకుంది.