టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై స్టార్ ఆల్రౌండర్, టీ20 ప్రపంచకప్ విజేత అక్షర్ పటేల్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచ్ అని కొనియాడాడు. ఈ తరానికి తగ్గట్లు అతను అప్డేట్ అయ్యాడని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో అక్షర్ పటేల్ను అప్ది ఆర్డర్లో పంపించి రాహుల్ ద్రవిడ్ ఫలితాన్ని రాబట్టాడు.
34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును విరాట్ కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. 31 బంతుల్లో 4 సిక్స్లు, ఓ ఫోర్ సాయంతో 47 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.

ఈ టీ20 ప్రపంచకప్ విజయంతో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అతనికి టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ టైటిల్తో వీడ్కోలు పలికారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర్ పటేల్.. రాహుల్ ద్రవిడ్ తనకు ఇచ్చిన ఓ అడ్వైజ్ గురించి చెప్పుకొచ్చాడు.
'భారత్-ఏ జట్టుకు ఆడుతున్నప్పటి నుంచి నాకు రాహుల్ ద్రవిడ్ తెలుసు. మూడేళ్ల పాటు టీమిండియాకు దూరంగా ఉన్న నేను భారత్-ఏకు ప్రాతినిథ్యం వహించాను. ఆ సమయంలో భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఆ టైమ్లో ఆయన నాకు ఎంతో అండగా నిలిచారు. రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు.
భారత్ తరఫున ఎన్ని పరుగులు చేసినా.. ఎంత మంచి ఇన్నింగ్స్లు ఆడినా కొన్నేళ్ల తర్వాత పెద్దగా గుర్తుకు ఉండవని, అదే ప్రపంచకప్ గెలిస్తే జీవితాంతం మరిచిపోలేని అనుభూతిగా నిలిచిపోతుందని చెప్పేవాడు. రాహుల్ ద్రవిడ్.. క్రికెట్ జెంటిల్మన్. రోహిత్ శర్మ కూడా ఇదే చెప్పేవాడు.
రాహుల్ ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కుర్రాళ్లకు తగ్గట్లు తన వ్యక్తిత్వాన్నే మార్చుకున్నాడు. ఆయన ఆడినప్పటికీ ఇప్పటికీ ఆటలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు అనుగుణంగా ఆయన మారడం గొప్ప విషయం. డ్రెస్సింగ్ రూమ్లో మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెట్టినా.. అల్లరి చేసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రపంచకప్ విజయంతో ఆయనకు వీడ్కోలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రపంచకప్ కంటే పెద్ద విజయం ఏది లేదు.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనతో ఆయన హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అక్షర్ పటేల్ కూడా ఈ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.