టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతని సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్షర్ పటేల్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన కుమారుడికి టీమిండియా జెర్సీ వేసి తీసిన ఫొటోను షేర్ చేశాడు. ఐదు రోజుల క్రితమే(డిసెంబర్ 19) తనకు కొడుకు పుట్టాడని అక్షర్ పేర్కొన్నాడు. తమ కొడుకకు హక్ష పటేల్ అని పేరు పెట్టిన్నట్లు తెలిపాడు.
అక్షర్ పటేల్ తండ్రైన విషయం అతని కన్నా ముందే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మెల్ బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం రోహిత్ మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్బంగా రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో తనుష్ కొటియన్ను తీసుకోవడానికి గల కారణాన్ని రోహిత్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ తండ్రయ్యాడని, అతను ఆసీస్ పర్యటనకు వచ్చే స్థితిలో లేడని చెప్పాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఫిట్గా లేకపోవడంతో దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తనుష్ కోటియన్ను ఎంపిక చేసినట్లు వివరణ ఇచ్చాడు.
తాను తండ్రైన విషయాన్ని రోహిత్ చెప్పడంతో అక్షర్ పటేల్ అభిమానులతో పంచుకున్నాడు. ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో అక్షర్ పటేల్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.