
కొలంబో: సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో శ్రీలంక శుభారంభం చేసింది. కొలంబో వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో 14 పరుగులతో సఫారీలపై గెలుపొందింది. ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(115 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 118) సూపర్ సెంచరీతో చెలరేగగా.. ఆల్ రౌండర్ చరిత్ అసలంక అర్ధ సెంచరీతో రాణించాడు. దాంతో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన గేమ్లో శ్రీలంక థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. అవిష్కా, అసలంకలకు అండగా.. ధనుంజయ డిసిల్వా(44) రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్, టబ్రైజ్ షంసీ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ జట్టులో ఎయిడెన్ మార్క్రమ్(90 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. డస్సెన్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో హెన్రీచ్ క్లాసెన్(36) మెరుపులు మెరిసినా ఫలితం లేకపోయింది.
చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 32 పరుగులు కావాల్సి ఉండగా.. 49వ ఓవర్లో ఆ జట్టు కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. దాంతో చివరి ఓవర్లో 27 పరుగులు అవసరమయ్యాయి. రబడా రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించినా.. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది.