న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిఫ్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆడే అవకాశం లభిస్తే సత్తా చాటుతానని టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ అవేశ్ ఖాన్ తెలిపాడు. తన శక్తిమేరకు రాణిస్తానన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో అవేశ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున దుమ్మురేపాడు. ఎనిమిది మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అతను.. డబ్ల్యూటీసీ, ఇంగ్లండ్తో సిరీస్లకు ఎంపిక చేసిన జంబో జట్టులో స్టాండ్ బై ప్లేయర్గా అవకాశం దక్కించుకున్నాడు. జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఈ పర్యటనలో తుది జట్టులో ఆడే అవకాశం వస్తే తన శక్తిమేరకు కృషి చేసి మంచి ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవేశ్ఖాన్ చెప్పుకొచ్చాడు. 'నేను నెట్ బౌలర్గా టీమిండియాతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లాను. ఇంగ్లండ్లో జరిగిన 2019 ప్రపంచకప్ సమయంలోనూ జట్టుతో ఉన్నా. ఆసియా కప్, స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్కు కూడా టీమిండియాతోనే ఉన్నా. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో స్టాండ్ బై బౌలర్గా నాకు మంచి అవకాశం వచ్చింది. ఒకవేళ జట్టులో ఎవరైనా గాయపడితే తుది జట్టులో చోటు దక్కొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కసరత్తులు మొదలుపెడతా. తుది జట్టులో చోటు దక్కితే శక్తిమేరకు కృషి చేసి మంచి ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాను'అని అవేశ్ఖాన్ అన్నాడు. అవేశ్ఖాన్తో పాటు అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నాగ్వాస్వాలా స్టాండ్ బై బౌలర్లుగా ఎంపికయ్యారు.