
డర్హమ్: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ల సిరీస్కు ముందు కౌంటీ ఎలెవన్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సన్నాహక మ్యాచ్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు సీనియర్ బౌలర్ల మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా భారత ఆటగాళ్లు ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కౌంటీ టీమ్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. సుందర్, ఆవేశ్ కౌన్ ప్రత్యర్థి టీమ్ తరఫున బౌలింగ్ చేస్తున్నారు.
వాస్తవానికి ముందుస్తు ప్రణాళికలో ఈ ప్రాక్టీ మ్యాచ్లు లేవు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత సర్వత్రా విమర్శలు రావడంతో బీసీసీఐ అప్పటికప్పుడు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడి రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఏర్పాటు చేసింది. దీనికి కౌంటీ క్రికెట్లో ఒక్కో టీమ్ నుంచి 14 మందితో కూడిన సెలెక్టీవ్ టీమ్ను ఎంపిక చేసింది. వార్విక్షైర్ టీమ్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించిన టీమిండియా మేనేజ్మెంట్.. ఫస్ట్ వామప్ మ్యాచ్లోయువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే సుందర్, ఆవేశ్ ఖాన్లను ప్రత్యర్థి టీమ్ తరఫున బరిలోకి దించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ(9), మయాంక్ అగర్వాల్(28) దారుణంగా విఫలమయ్యారు. నయావాల్ చేతేశ్వర్ పుజారా సైతం(21) చేతులెత్తేసాడు. దాంతో 67 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(1 బ్యాటింగ్), హనుమ విహారీ(14 బ్యాటింగ్) ఉన్నారు. కౌంటీ ఎలెవన్ టీమ్లో లిండన్ జేమ్స్ రెండు వికెట్లు తీయగా.. జాక్ కార్సన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. సుందర్ ఇంకా బౌలింగ్ చేయలేదు.
రిషభ్ పంత్ గైర్హాజరీలో ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా తేలిన పంత్ లండన్లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటీవ్ వచ్చింది. బుధవారం అతను డర్హమ్ ప్రాక్టీస్ క్యాంప్లో జట్టుతో కలవనున్నాడు. 28 నుంచి ప్రారంభమయ్యే రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు.