Andre Borovec, IND vs AUS 2nd T20: బౌలింగ్ వైఫల్యమే తమ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన రెండో టీ20లోనూ సమష్టిగా విఫలమైన ఆస్ట్రేలియా 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ విజయంతో టీమిండియా 5 టీ20ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్ చేస్తూ మాథ్యూ వేడ్ తీవ్రంగా గాయపడటంతో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అతనికి బదులు ఆసీస్ కోచ్ ఆండ్రీ బోరోవెక్(Andre Borovec) హాజరయ్యాడు. తమ పరాజయానికి గల కారణాలను వెల్లడించాడు. బౌలింగ్ వైఫల్యంతో పాటు తమ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయకపోవడంతోనే ఓటమిపాలయ్యామని తెలిపాడు.

'టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి మా బ్యాటర్లను కట్టడి చేసింది. పవర్ ప్లేలో మాకు కావాల్సిన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణాళికలతో పాటు మంచి ఉద్దేశంతో బ్యాటింగ్ చేయాలి. ఎలాంటి తప్పిదం చేయవద్దు. మేం సరైన నిర్ణయాలే తీసుకున్నా.. మా ప్రణాళికలను సరైన సమయంలో సమర్థవంతంగా అమలు చేయలేకపోయాం.'అని ఆండ్రీ బోరోవెక్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(25 బంతుల్లో 30 ఫోర్లు, 2 సిక్స్లతో 53), రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 58), ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
చివర్లో రింకూ సింగ్(9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 నాటౌట్) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ మాథ్యూ వేడ్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 42 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్దీస్ సింగ్, అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ తలో వికెట్ తీసారు.