
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో మరో అదిరిపోయే నాకౌట్.. బంతి బంతికీ విజయం దోబూచిలాడిన వేళ.. ఆస్ట్రేలియా అద్వితీయ ఆటతీరుతో వహ్వా.. అనిపించింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) వీరోచిత బ్యాటింగ్తో ఆసీస్ 5 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్ చేజార్చిన పాక్ ఇంటిదారిపట్టింది. అయితే ఈ విజయానంతరం ఆసీస్ ఆటగాళ్లతో పాటు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే 'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' నినాదాలు చేశారు. పాకిస్థాన్పై విజయాన్ని భారత్ సాధించినట్లుగా సెలెబ్రేట్ చేసుకున్నారు. అభిమానులు నినాదాలతో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పాక్పై ఆసీస్ సాధించిన విజయాన్ని భారత అభిమానులు తమ విజయంగా భావిస్తున్నారు. భారత ఓటమి అనంతరం ఎగతాళి చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు, ఆ దేశ క్రికెట్ బోర్డుకు తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.