
సిడ్నీ: కరోనా కష్టాలను దాటిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ తమ భార్యా బిడ్డలు, తల్లిదండ్రులను కలిసి ఊరట పొందారు. ఈ సంతోష క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
మిగతా విదేశీ క్రికెటర్లు మూడు రోజుల్లోనే సజావుగా తమ దేశాలకు చేరుకున్నారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, కామెంటేటర్ల బృందానికి మాత్రం అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా పెట్టిన కఠిన ఆంక్షలతో వాళ్లంతా చుక్కలు చూశారు. నేరుగా భారత్ నుంచి ప్రయాణాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..అంతటితో ఆగకుండా ఇతర దేశాల్లో పది రోజులకు పైగా ఉండి రావాలనే నిబంధన పెట్టింది. దాంతో వారు మాల్దీవుల్లో 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆసీస్ వెళ్లి మరో 14 రోజులు సిడ్నీలో క్వారంటైన్లో ఉన్నారు. ఆదివారంతో గడువు పూర్తవ్వడంతో ఆటగాళ్లు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
'ఇంటికి చేరుకోవడం గొప్పగా అనిపిస్తోంది' అని డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు పిల్లలతో ఉన్న ఫొటోలను పంచుకున్నాడు. 'కొత్త గాలి పీల్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది' అని పేసర్ జేసన్ బెరెన్డార్ఫ్ ఓ వార్తా సంస్థకు తెలిపాడు. 'ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోవడం కఠినంగా ఉంటుంది. ఇంటికి వెళ్తామని తెలియడం మాత్రం ఉపశమనం. ఇప్పుడు మా క్వారంటైన్ ముగిసింది. ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను చూసేందుకు ఆగలేకపోతున్నా' అని తెలిపాడు. ఇక ఐపీఎల్ రెండో దశ సెప్టెంబర్లో యూఏఈలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. బహుశా ఆసీస్ క్రికెటర్లు ఎక్కువ మంది అక్కడికి రాకపోవచ్చు. కఠిన క్వారంటైన్ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే చాన్స్ ఉంది.