పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కామెంటేటర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిరీస్కు ఒక కోచ్ మారుతున్నాడని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోచ్లను అద్దెకు తెచ్చుకుంటుందని విమర్శించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్.. ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. తమ పర్యటనను పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది.
మెల్బోర్న్ మైదానం వేదికగా సోమవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజామ్(37), మహమ్మద్ రిజ్వాన్(44), నసీమ్ షా(40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. సీన్ అబాట్, మార్నస్ లబుషేన్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్టీవ్ స్మిత్(44), జోష్ ఇంగ్లీస్(49), ప్యాట్ కమిన్స్(32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్కు కామెంటేటర్లుగా వ్యవహరించిన మార్క్ హోవార్డ్, మార్క్ వా, కెర్రీ ఒకీఫ్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై సెటైర్లు పేల్చారు. ముందుగా ఒక కామెంటేటర్ మాట్లాడుతూ.. 'పాకిస్థాన్ జట్టులో కోచ్ సగటు పని కాలం ఎంత?'అని అడగ్గా.. మరో కామెంటేటర్ అక్కడికి కోచ్లు అద్దెగా వెళ్తారన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో అంచనాలతో పాకిస్థాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్స్టన్ 4 నెలలకే గుడ్బై చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో నెలకొన్న విబేధాలతోనే అతను తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. గ్యారీ కిర్స్టన్ తప్పుకోవడంతో పాకిస్థాన్ మూడు ఫార్మాట్ల హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసన్ గిలేస్పీ నియమితులయ్యాడు. పాకిస్థాన్ క్రికెట్లో హెడ్ కోచ్లు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా మంది ఆ జట్టు కోచింగ్ కాంట్రాక్ట్లను వదులుకున్నారు.