మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఆదివారం న్యూ ఛండీఘర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతికా రావల్(94 బంతుల్లో 6 ఫోర్లతో 64), స్మృతి మంధాన(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58)తో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్(57 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో సత్తా చాటారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(11), జెమీమా రోడ్రిగ్స్(18) విఫలమైనా.. రిచా ఘోష్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25), దీప్తి శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగన్ స్కట్(2/45) రెండు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, అన్నేబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తహిలా మెక్గ్రాత్ చెరో వికెట్ తీసారు.

అనంతరం ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 2 వికెట్లకు 282 పరుగులు చేసి 35 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఫోబే లిచ్ఫీల్డ్(80 బంతుల్లో 14 ఫోర్లతో 88), బెత్ మూనీ(74 బంతుల్లో 9 ఫోర్లతో 77 నాటౌట్), అన్నబెల్ సదర్లాండ్(51 బంతుల్లో 6 ఫోర్లతో 54 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోయారు.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం జరగనుంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే.