
కానెబెర్రా: టీ20 ప్రపంచకప్ ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్తో మరో మ్యాచ్ మిగిలుడగానే టీ20 సిరీస్ కోల్పోయిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. క్లీన్ స్వీప్ గండం నుంచి గట్టెక్కింది. వర్షం పుణ్యమా.. మెగా టోర్నీ ముందు ఇజ్జత్ కాపాడుకుంది. ఇంగ్లండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్ సజావుగా జరిగితే ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయేది.
ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను 12 ఓవర్లకు కుదించారు. నిర్ణీత 12 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్) తన ఫామ్ను కొనసాగించగా.. డేవిడ్ మలాన్(19 బంతుల్లో 4 ఫోర్లతో 23), బెన్ స్టోక్స్(10 బంతుల్లో సిక్స్తో 17 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.
అనంతరం 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఖాతా తెరవకుండానే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకే కెప్టెన్ ఆరోన్ ఫించ్(0), మిచెల్ మార్ష్(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగారు. అతని మరుసటి ఓవర్ చివరి బంతికి గ్లేన్ మ్యాక్స్వెల్(8) కూడా ఔటవ్వడంతో ఆసీస్ 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(7 నాటౌట్), మార్కస్ స్టోయినీస్ ఆత్మరక్షణలో ఆడుతుండుగా.. వర్షం మరోసారి అంతరాయం కలిగించింది.
ఇక వర్షం ఎంతకూ విరామం ఇవ్వకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. దాంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియగా.. ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ జరిగితే మాత్రం ఆసీస్ కచ్చితంగా ఓడిపోయేది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించడంతో బ్యాటర్లు తడబడ్డారు. జోస్ బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.