న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మరో అంతర్జాతీయ మ్యాచ్కు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ ముందు హైదరాబాద్ వేదికగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడగా.. తొక్కిసలాట జరిగింది. 39 వేల సామర్థ్యం కలిగిన స్డేడియం అభిమానులతో కిక్కిరిసింది.
అయితే ఈ సారి ఇక్కడ టెస్టు మ్యాచ్ నిర్వహించే విషయంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్యలో బోర్డర్- గావస్కర్ సిరీస్ కోసం భారత్కు ఆస్ట్రేలియా జట్టు రానుంది. ఈ సిరీస్లో భాగంగా నాలుగు టెస్టులు జరుగుతాయి. అందులో ఓ మ్యాచ్కు ఢిల్లీ వేదికగా నిలవడం ఖాయం కాగా.. మిగతా మ్యాచ్ల నిర్వహణ కోసం అహ్మదాబాద్, ధర్మశాల, నాగ్పూర్, చెన్నై, హైదరాబాద్ రేసులో ఉన్నాయి. ధర్మశాల ఇప్పటివరకూ ఒకే ఒక్క టెస్టు (2017 మార్చిలో ఆస్ట్రేలియాతో)కే ఆతిథ్యమిచ్చింది.
చివరగా ఐదేళ్ల క్రితం (2017 డిసెంబర్) హైదరాబాద్లో శ్రీలంకతో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడింది. రొటేషన్ పద్ధతి ప్రకారం ఢిల్లీలో ఈ సారి కచ్చితంగా ఓ మ్యాచ్ జరగనుంది. 'నాలుగు మ్యాచ్ల సిరీస్లో ఢిల్లీ రెండో టెస్టుకు వేదికగా నిలవొచ్చు. ధర్మశాలలో మూడో టెస్టు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే తేదీలు, వేదికలపై నిర్ణయం తీసుకుంటారు'అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపాడు. చివరి టెస్టు అహ్మదాబాద్లో జరిగే అవకాశాలున్నాయి. తొలి టెస్టు కోసం నాగ్పూర్, చెన్నై లేదా హైదరాబాద్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నాలుగు టెస్టుల్లో దేన్ని డేనైట్ మ్యాచ్గా నిర్వహిస్తారన్నది కూడా తేల్చాల్సి ఉంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్ జరగనుండగా... ఈ టోర్నీ ఫైనల్కు భారత్ చేరాలంటే ఆసీస్ను 4-0తో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అయితే హెచ్సీఏలో నెలకొన్న వివాదాలతో పాటు టీ20 మ్యాచ్ నిర్వహణలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరగడం డౌటేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటతో హెచ్సీఏ పరువు గంగలో కలిసిందని, మళ్లీ ఎలా బీసీసీఐ హైదరాబాద్కు మ్యాచ్ ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు.