భారత్తో మూడో టీ20లో ఆస్ట్రేలియా 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. టీమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74), మార్కస్ స్టోయినీస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/31) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/33) రెండు వికెట్లు తీయగా.. శివమ్ దూబే(1/43) ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. అర్ష్దీప్ సింగ్ ధాటికి ట్రావిస్ హెడ్(11), జోష్ ఇంగ్లీస్(1) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్(11)తో కలిసి టీమ్ డేవిడ్ బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఆ వెంటనే మిచెల్ మార్ష్ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి బంతికే మిచెల్ ఓవెన్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి డకౌటయ్యాడు. క్రీజులోకి మార్కస్ స్టోయినీస్ రాగా.. టీమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు.

భారత బౌలర్లకు తన బ్యాట్తో బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. ముఖ్యంగా ఐదో బంతిని స్ట్రైట్ డ్రైవ్ షాట్తో స్టేడియం బయటకు పంపించాడు. ఈ బంతి 129 మీటర్ల దూరంలో పడింది. శివమ్ దూబే వేసిన మరుసటి ఓవర్లో మూడు బౌండరీలు బాది 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లు బాదిన టీమ్ డేవిడ్.. శివమ్ దూబే బౌలింగ్లో తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్పై అద్భుతంగా జంప్ చేసి తిలక్ బంతిని అందుకున్నాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ స్టన్నింగ్ క్యాచ్తో ఆసీస్ భారీ స్కోర్కు బ్రేక్ పడింది.
టీమ్ డేవిడ్ ఔటైనా.. స్టోయినీస్ దూకుడు కొనసాగించాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో మూడు బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్ బుమ్రా 6 పరుగులే ఇవ్వగా.. ఆకరి ఓవర్లో స్టోయినీస్ బౌండరీ బాది క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఆసీస్ 186 పరుగులకే పరిమితమైంది.