
బ్రిస్బేన్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ అలీస్సా హేలీ అధిగమించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక బ్యాటర్లను ఔట్ చేసిన వికెట్ కీపర్గా అలీస్సా హేలీ అరుదైన ఘనతను అందుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఈ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఈ ఫీట్ను సాధించింది.
టీ20ల్లో ధోనీ తన క్యాచ్లు, స్టంపింగ్లతో మొత్తం 91 మంది బ్యాట్స్మెన్ ఔట్లలో పాలుపంచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకూ ఇదే అత్యధికం, అయితే న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో హేలీ ఒక స్టంపౌట్, మరొక క్యాచ్తో మొత్తం 92 వికెట్స్లో పాలుపంచుకుని అత్యధిక బ్యాట్స్మెన్ను ఔట్ చేసిన వికెట్ కీపర్గా ధోనీని వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అలీస్సా 50 స్టంపౌట్లు, 42 క్యాచ్లు పట్టింది. ఈ ఇద్దరి తర్వాత సారా టేలర్(74), రాచెల్ ప్రీస్ట్(72), మెరిస్సా (70) ఉన్నారు. ధోనీ మినహా అంతా మహిళా క్రికెటర్లే కావడం విశేషం.
ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళలు న్యూజిలాండ్ మహిళల జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ టీమ్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అమీ సత్తర్ వేట్(30), సుజీ బేట్స్(22) టాప్స్కోరర్లుగా నిలిచారు. సత్తర్ వేట్ను స్టంపౌట్ చేసిన హేలీ..లారెన్ డౌన్ ఇచ్చిన క్యాచ్ పట్టింది.
అనంతరం ఆస్ట్రేలియా మహిళా టీమ్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లకు 129 రన్స్ చేసి 20 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. అలీస్సా(33), బెత్ మూనీ(22), మెగ్ లాన్నింగ్(26 నాటౌట్), రాచెల్ హేన్స్(40 నాటౌట్) రాణించారు.