ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా వ్యూహం బెడిసి కొట్టింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్లో స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగిన ఆసీస్.. భారీ మూల్యం చెల్లించుకుంది. స్పిన్నర్ నాథన్ లయన్పై వేటు వేసిన ఆసీస్.. ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగింది.
స్పిన్నర్ లేకపోవడంతో ఆసీస్ నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్రేట్కు కారణమైంది. తొలి ఇన్నింగ్స్లో నిర్ణీత సమయం కంటే 8 ఓవర్లు తక్కువగా వేసింది. స్లో ఓవర్ రేట్కు కారణమైన ఆసీస్పై ఐసీసీ చర్యలు తీసుకోనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్లో కోత పడనుంది. ఓవర్కు ఒక పాయింట్ చొప్పున కోత విధించనున్నారు.

ఈ లెక్కన ఆసీస్ డబ్ల్యూటీసీ పాయింట్స్లో 8 పాయింట్ల కోతకు గురవ్వనున్నాయి. ఆసీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కూడా కోత పడనుంది. రెండో ఇన్నింగ్స్లో కూడా స్లో ఓవర్ రేట్ కారణమైతే మరికొన్ని పాయింట్లకు కోతకు గురవుతాయి. ఈ జరిమానా.. ఆసీస్ ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేయనుంది.
స్పిన్నర్ లేకపోవడంతోనే ఆసీస్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఐదుగురు పేసర్లు బౌలింగ్ చేయడంతో ఆలస్యమైంది. అంతేకాకుండా ఇంగ్లండ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్లో 334 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(206 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్తో 138 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. జాక్ క్రాలీ(76) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/75) ఆరు వికెట్లు తీయగా.. మిచెల్ నెజర్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డగ్గొట్ తలో వికెట్ తీసారు.
స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'టాస్ పడగానే నాథన్ లయన్ జట్టులో లేడనే విషయం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అతను లేకపోవడం మాకు కలిసొచ్చింది. పేసర్లను ఎదుర్కోవడం సులువైంది. బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడంతో స్వేచ్చగా బ్యాటింగ్ చేశాను. ఆట కొనసాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది.'అని జాక్ క్రాలీ తెలిపాడు.
2011 తర్వాత నాథన్ లయన్ సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడకపోవడం ఇది రెండోసారి మాత్రమే. మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే అతనికి ఈ విషయం తెలిసిందని, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై చాలా కోపంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.