చెన్నై: వన్డే ప్రపంచకప్ తొలి పోరుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. ఆతిథ్య భారత్తో చెన్నై వేదికగా ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. మెగా టోర్నీని విజయంతో ప్రారంభించాలనే కసితో తొలిపోరుకు ఆసీస్ సమయాత్తమైంది. మెగా టోర్నీకి ముందు భారత్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో కోల్పోయిన ఆసీస్.. వామప్ మ్యాచ్ల్లో సత్తా చాటింది. పాకిస్థాన్ను మట్టి కరిపించి ఫుల్ జోష్లో ఉంది.
పైగా చెన్నై వేదికగా ఆసీస్కు మంచి రికార్డ్ ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మూడు ప్రపంచకప్లు ఆడిన ఆసీస్.. మూడింటిలోనూ విజయం సాధించింది. 1987 ప్రపంచకప్లో భారత్ను ఒక్క పరుగుతో ఓడించింది. ఈ క్రమంలోనే రేపటి మ్యాచ్లో భారత్ను ఓడించి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. ఇరు జట్ల బలబలాల పరంగా సమంగా ఉండటంతో రసవత్తర పోరు జరగనుంది.

ఆస్ట్రేలియా తుది జట్టు ఎంపిక పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో ఆ జట్టు బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడమ్ జంపా ఆడనుండగా.. స్పిన్ ఆల్రౌండర్గా గ్లేన్ మ్యాక్స్వెల్ ఆడనున్నాడు.
పార్ట్టైమ్ స్పిన్నర్గా మార్నస్ లబుషేన్ బౌలింగ్ చేయనున్నాడు. ఆసీస్ ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు జోష్ హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్లతో ఆడనుంది. పేస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడనున్నాడు. వికెట్ కీపర్గా జోష్ ఇంగ్లీస్కు బదులు అలెక్స్ క్యారీ బరిలోకి దిగనున్నాడు. తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న మార్కస్ స్టోయినీస్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు.
ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బరిలోకి దిగనుండగా.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆసీస్ ఆటగాళ్లలో చాలా మందికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటంతో భారత కండిషన్స్ పెద్ద సమస్య అయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా గ్లేన్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్, బౌలింగ్లో ప్రమాదకరంగా మారనున్నాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, గ్లేన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా.