న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ కిమ్ గార్త్ అరుదైన ఘనతను అందుకుంది. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ప్రాతినిథ్యం వహించిన దేశానికి వ్యతిరేకంగా వన్డే మ్యాచ్ ఆడి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా కుటుంబం మొత్తం ప్రాతినిథ్యం వహించిన జట్టుకు వ్యతిరేకంగా ఆడటం ఇదే తొలిసారి.
అసలు కుటుంబం మొత్తం క్రికెటర్లుగా ఉండటమే అరుదైన అంశం. ఓ క్రికెటర్ రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించడం సాధారణమే అయినప్పటికీ.. తనతో పాటు కుటుంబంలోని నలుగురు క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించిన జట్టుతో పోటీపడటం ఇదే తొలిసారి.

ఐర్లాండ్తో మంగళవారం జరిగిన రెండో వన్డేతో కిమ్ గార్త్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2010 నుంచి 2019 వరకు ఐర్లాండ్కు ప్రాతినిథ్యం వమించిన కిమ్ గార్త్.. 2022 నుంచి ఆస్ట్రేలియాకు ఆడుతోంది. కిమ్ తండ్రి జోనాథన్ గార్త్, తల్లి అన్నే మేరీ మెక్డోనాల్డ్, తమ్ముడు జోనాథన్ గార్త్ ఐర్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
ఇక ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 153 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఎల్లీస్ పెర్రీ(91), అష్లే గార్డ్నర్(65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బెత్ మూనీ(49) విలువైన పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 38.2 ఓవర్లలో 168 పరుగులకు కుప్పకూలింది.
యామీ హంటర్(50), గాబీ లివిస్(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్లో కిమ్ గార్త్ ఓ వికెట్ పడగొట్టింది. 6 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఆమె 2 ఓవర్లను మెయిడిన్ చేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చింది.