
సిడ్నీ: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు కరోనా సెగ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కేన్ రిచర్డ్సన్కు కోవిడ్-19 (కరోనా వైరస్) లక్షణాలు కనిపించడంతో టీమ్మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. వెంటనే టీమ్ వైద్య బృందం అతనికి పరీక్షలు నిర్వహించింది. రిచర్డ్సన్ గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రిచర్డ్సన్ను ప్రత్యేకంగా ఉంచి వైద్యుల బృందంతో పర్యవేక్షిస్తున్నామని సీఏ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. దీంతో శుక్రవారం న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డేకు రిచర్డ్సన్ దూరమయ్యాడని, అతడికి బదులు సీన్ అబ్బాట్ట్ను ఎంపిక చేశామని ఆ అధికారి తెలిపారు.
'రిచర్డ్సన్ సాధారణ గొంతు సమస్యతోనే బాధపడుతున్నట్లు మా వైద్యబృందం సూచించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలనేపథ్యంలో రిచర్డ్సన్ను జట్టుకు దూరంగా ఉంచాం. ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించాం. గత 14 రోజులు అతను విదేశాల్లో పలు టోర్నీలు ఆడాడు. ఇటీవలే ఆస్ట్రేలియా తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని జట్టుకు దూరంగా ఉంచి పర్యవేక్షిస్తున్నాం.'అని తెలిపారు.
కరోనా పరీక్ష ఫలితాలు రాగానే ఈ వ్యవహారంపై స్పష్టత వస్తుందన్నారు. కరోనా లేకుంటే అతడు తిరిగి జట్టులో చేరతాడని సదరు సీఏ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు న్యూజిలాండ్తో జరిగే ఈ వన్డే సిరీస్ చటిచప్పుడు లేకుండా ఖాళీ మైదానల్లోనే జరగనుంది. ఈ సిరీస్కు ప్రేక్షకులను అనుమతించట్లేదని, టికెట్లు కొన్నవారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక కరోనా కల్లలోం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న ఆటలు ఆగమగాం అయ్యాయి. కొన్ని టోర్నీలు వాయిదా పడగా మరికొన్ని ఇలా ప్రేక్షకులు లేకుండా జరుగుతున్నాయి. ఐపీఎల్ కూడా ఇదే తరహాలో జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 27వేల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడగా.. 4700 మంది మృతి చెందారు. 68వేల మంది కోలుకున్నారు.