
మెల్బోర్న్: రూల్స్ అందరూ పాటించాల్సిందేనని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అన్నాడు. వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ వ్యాక్సిన్ వేయించుకోకపోవడాన్ని అతను తప్పుబట్టాడు. జకోవిచ్ పట్ల ఆస్ట్రేలియా అధికారులు ప్రవర్తించిన తీరులో కూడా తప్పులేదన్నాడు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 గ్రాండ్స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్బోర్న్ వచ్చిన నొవాక్ జొకోవిచ్కు చేధు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ప్రత్యేక అనుమతితో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన జొకోవిచ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
టోర్నీలో పాల్గొనేవారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన నుంచి జకోవిచ్ ప్రత్యేక మినహాయింపు కోరాడు. దానికి నిర్వాహకులు అంగీకరించారు. అయితే వాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలు వెల్లడించకపోవడంతో విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఇక ఈ వ్యవహారంపై రాఫెల్ నాదల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జకోవిచ్కు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం బాలేదు. కానీ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల గురించి అతని తెలుసు. అయినా వ్యాక్సిన్ తీసుకోకూడదని అతను నిర్ణయించుకున్నాడు.
వ్యాక్సిన్ తీసుకోవాలని రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రజల ఆగ్రహాన్ని కూడా తప్పుబట్టలేం. గత కొన్నాళ్లుగా విపత్కర పరిస్థితులు, కఠిన లాక్డౌన్స్తో వారు విసిగిపోయారు. నా అభిప్రాయం ప్రకారం ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. నేను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ టోర్నీలో ఆడుతా'అని నాదల్ చెప్పుకొచ్చాడు.
జకోవిచ్ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందిస్తూ.. 'జకోవిచ్ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు పొందడానికి సరైన కారణం చూపితేనే టోర్నిలో ఆడతారు.. లేకపోతే తర్వాతి విమానంలోనే ఇంటికి పోతారు' అని వ్యాఖ్యానించారు. అతని కోసం ప్రత్యేక నిబంధనలు ఏవీ లేవని కుండబద్దలు కొట్టారు.