ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా పోరాటం ముగిసింది. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.గ్రూప్-బీలో భాగంగా ఐర్లాండ్, జింబాబ్వే వేదికగా పల్లెకెలె వేదికగా మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కనీసం టాస్ పడకుండానే ఈ మ్యాచ్ తుడుచుపెట్టుకుపోయింది.
ఈ మ్యాచ్ను రద్దు చేసినట్లు ప్రకటించిన అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో జింబాబ్వే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. ఆసీస్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-బీలో మూడు మ్యాచ్లకు మూడు గెలిచిన శ్రీలంక, రెండు విజయాలు ఒక మ్యాచ్ రద్దుతో జింబాబ్వే సూపర్-8కు క్వాలిఫై అయ్యాయి.

జింబాబ్వేతో పాటు శ్రీలంక చేతిలో చిత్తయిన ఆస్ట్రేలియా.. ఐర్లాండ్పై ఆశలు పెట్టుకుంది. దేవుడిపై భారం వేసిన ఆస్ట్రేలియా.. జింబాబ్వేతో మ్యాచ్లో ఐర్లాండ్ గెలవాలని కోరుకుంది. కానీ ఈ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆస్ట్రేలియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను ఓమన్తో ఆడాల్సి ఉంది. శుక్రవారం పల్లెకెలె వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా ఇలా లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇది రెండోసారి. నాకౌట్ చేరకుండా వెనుదిరిగడం మూడోసారి.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2009 టీ20 ప్రపంచకప్లోనూ ఆస్ట్రేలియా లీగ్ దశలోనే వెనుదిరిగింది. గ్రూప్ దశలో వెస్టిండీస్,శ్రీలంక చేతిలో ఓడిన ఆసీస్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. మొదటి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన ఆసీస్.. ఆ తర్వాత పుంజుకున్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో సెమీఫైనల్ చేరకుండానే సూపర్ 12లో నిష్క్రమించింది.
తాజా టోర్నీలో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమిపాలై లీగ్ దశలోనే వెనుదిరిగింది. బౌలింగ్ వైఫల్యం ఆసీస్ కొంపముంచింది. స్టార్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ గాయాలతో ఈ టోర్నీ దూరమవ్వడం ఆసీస్ కొంపముంచింది.