Matthew Wade, IND vs AUS 1st T20: భారత కుర్రాళ్లు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతోనే భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మాథ్యూ వేడ్.. చిన్న మైదానానికి తగ్గట్లు యార్కర్లు సంధించకపోవడం తమ ఓటమిని శాసించిందన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో భారత కుర్రాళ్లు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారని కొనియాడాడు. ఐపీఎల్తో పాటు టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడిన అనుభవం భారత కుర్రాళ్లకు ఉందని తెలిపాడు.

'చివరకు ఇది ఓ మంచి మ్యాచ్గా ముగిసింది. జోష్ ఇంగ్లీస్ విధ్వంసకర శతకంతో మాకు భారీ స్కోర్ అందించాడు. ఈ లక్ష్యాన్ని సునాయసంగా డిఫెండ్ చేసుకోగలమని భావించాను. కానీ భారత కుర్రాళ్లు అసాధారణ బ్యాటింగ్తో మా విజయాన్ని అడ్డుకున్నారు. ఈ భారత కుర్రాళ్లకు ఐపీఎల్తో పాటు ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.
మేం బాగానే బౌలింగ్ చేశాం. బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ కట్టుదిట్టమైన యార్కర్లను సంధించలేకపోయాం. చిన్న మైదానాల్లో బ్యాటర్లను అడ్డుకోవడానికి బౌలర్లకు ఉన్న ఏకైక అస్త్రం యార్కర్లు. ఈ మ్యాచ్లో ఓడినా మాకు అనేక సానుకూలంశాలు లభించాయి. ఇంగ్లీస్ అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఎల్లిస్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లాడు.'అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 110) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(41 బంతుల్లో 8 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 80), ఇషాన్ కిషన్(39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ షార్ట్, జాసన్ బెహ్రెండార్ఫ్ తలో వికెట్ తీసారు.