బ్యాటింగ్ వైఫల్యంతోనే పాకిస్థాన్తో మూడో వన్డేలో ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా తాత్కలిక సారథి జోష్ ఇంగ్లీస్ తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
తొలి వన్డేలో ఓటమిపాలైన పాకిస్థాన్.. రెండో వన్డేతో పాటు ఆఖరి మ్యాచ్లో విజయం సాధించింది. తద్వారా 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై పాకిస్థాన్ వన్డే సిరీస్ గెలిచింది. చివరిసారిగా 2002లో ఆసీస్ గడ్డపై పాక్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. భారత్తో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆసీస్ సీనియర్ ఆటగాళ్లంతా పాక్తో చివరి వన్డేకు దూరమయ్యారు.

టెస్ట్ ప్రిపరేషన్స్ కోసం ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. దాంతో ప్యాట్ కమిన్స్ స్థానంలో జోష్ ఇంగ్లీస్ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 31.5 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా మూడేసి వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్ రెండు, మహమ్మద్ హస్నైన్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం పాకిస్థాన్ 26.5 ఓవర్లలో 2 వికెట్లకు 143 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది. సయీమ్ ఆయుబ్(42), అబ్దుల్లా ఫఫీక్(37) టాప్ స్కోరర్లుగా నిలవగా.. బాబర్ ఆజామ్(28 నాటౌట్), మహమ్మద్ రిజ్వాన్(30 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోర్రీస్ రెండు వికెట్లు తీసాడు.
మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోష్ ఇంగ్లీస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'నిజాయితీగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఈ మ్యాచ్లోని తొలి మూడు క్వార్టర్స్లో మేం దారుణంగా విఫలమయ్యాం. గత మూడు మ్యాచ్లుగా మా బ్యాటర్లు కావాల్సిన పరుగులు చేయలేకపోయారు.
మా కుర్రాళ్లంతా తమదైన బ్యాటింగ్ శైలిని కలిగియున్నారు. కానీ సమష్టిగా పరుగులు చేయడం ముఖ్యం.
క్రీజులో నిలబడి డీప్ ఇన్నింగ్స్ ఆడి ఫలితాలు సాధించాలి. నా సొంతమైదానంలో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించడం గొప్పగా ఉంది. కానీ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసింది.'అని జోష్ ఇంగ్లీస్ చెప్పుకొచ్చాడు.