
మెల్బోర్న్: అడిలైడ్లో చిత్తుగా ఓడిన భారత్.. మెల్బోర్న్లో ఘన విజయాన్నందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. 133/6 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో మరో 67 పరుగులు జోడించి 200 రన్స్కు ఆలౌట్ అయింది. కామెరూన్ గ్రీన్(45), కమిన్స్(22) కొంత విసిగించినా.. భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఫలితాన్ని రాబట్టారు. హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్కు ఒక వికెట్ దక్కింది.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ 131 పరుగుల ఆధిక్యం తీసేయగా ఆసీస్కు 69 పరుగుల లీడ్ ఉంది. దాంతో భారత్ ముందు 70 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం భారత్కు ఇది సులువైన లక్ష్యమే. కానీ అడిలైడ్ దారుణ ఇన్నింగ్స్ రిపీట్ అయితే మాత్రం నిరాశ తప్పదు.
ఇక నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 23 పరుగులు జత చేసిన అనంతరం కమిన్స్ (103 బంతుల్లో 1 ఫోర్తో 22) వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో కమిన్స్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన స్టార్క్ సహకారంతో గ్రీన్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. బుమ్రా వేసిన 90 ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. అర్ధ సెంచరీకి చేరువవుతున్న గ్రీన్ (146 బంతుల్లో 5 ఫోర్లతో 45)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత లయన్ను సిరాజ్, హేజిల్వుడ్ను అశ్విన్ పెవిలియన్కు పంపడంతో ఆతిథ్య జట్టు 200 పరుగులకు ఆలౌట్ అయింది. వాస్తవానికి టేలండర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.
సంక్లిప్త స్కోర్తు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 200 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 326 ఆలౌట్