వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 48.4 ఓవర్లలో 231 పరుగులకు కుప్పకూలింది. కీసీ కార్టీ(108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 88), రోస్టన్ చేజ్(67 బంతుల్లో 7 ఫోర్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో యువ పేసర్ జేవియర్ కోలిన్ బార్ట్లెట్ (4/17) నాలుగు వికెట్లతో వెస్టిండీస్ పతనాన్ని శాసించగా.. సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసారు. ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 38.3 ఓవర్లలో 2 వికెట్లకు 232 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(2) విఫలమైనా.. జోష్ ఇంగ్లీస్(43 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 65), కామెరూన్ గ్రీన్(104 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 77 నాటౌట్), స్టీవ్ స్మిత్(79 బంతుల్లో 8 ఫోర్లతో 79 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
నాలుగు వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేవియర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఆసీస్తో రెండో టెస్ట్లో సంచలన విజయం సాధించి సిరీస్ను సమం చేసుకున్న విండీస్.. పరిమిత ఓవర్ల సిరీస్లో ఆ జోరును కొనసాగించ లేకపోయింది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ అద్భుత విజయాన్ని అందుకుంది.
ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ప్రదర్శనపై ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన అతను బౌలింగ్లో రెండు కీలక వికెట్లు తీసాడు. దాంతో అతని ఆల్రౌండ్ ప్రదర్శనపై ఆర్సీబీ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం కామెరూన్ గ్రీన్ను ఆర్సీబీ రూ. 17 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది.
ఈ యువ ఆల్రౌండర్పై బెంగళూరు ఫ్రాంచైజీ కోటీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే అతని ఆటతీరును ఫ్రాంచైజీతో పాటు అభిమానులు ఫాలో అవుతున్నారు.