దుబాయ్: టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు జోరు కొనసాగుతోంది. ఫస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికాను మట్టికరిపించిన ఆ జట్టు.. గురువారం శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(42 బంతుల్లో 10 ఫోర్లతో 65) సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకోగా.. బౌలింగ్లో ఆడమ్ జంపా(2/12) మ్యాజిక్ చేశాడు. ఈ గెలుపుతో ఆసీస్ తమ సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోగా.. శ్రీలంక మాత్రం సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. కుశాల్ పెరీరా(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), చరిత్ అసలంక(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), భానుక రాజపక్స(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33 నాటౌట్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్కార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 17 ఓవర్లలోనే 3 వికెట్లకు 155 రన్స్ చేసి 18 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. డేవిడ్ వార్నర్ విధ్వంసకర బ్యాటింగ్కు అండగా ఆరోన్ ఫించ్(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 37), స్టీవ్ స్మిత్(26 బంతుల్లో ఫోర్తో 28 నాటౌట్) కీలక పరుగులు చేశారు. లంక బౌలర్లలో వానిందు హసరంగాకు రెండు, డసన్ షనకు ఓ వికెట్ దక్కింది. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి దారుణంగా విఫలమవుతూ వచ్చిన వార్నర్.. కీలక సమయంలో ఫామ్లోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి రానుంది.
ఆసీస్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ ధాటిగా ప్రారంభించారు. ఈ ఇద్దరు పోటా పోటీగా బౌండరీలు బాదడంతో ఆస్ట్రేలియా పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 63 రన్స్ చేసింది. అయితే ఆ మరుసటి ఓవర్లోనే ఫించ్ ఔటవ్వడంతో తొలి వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ బౌండరీతో జోరు కనబర్చాడు. కానీ ఆ వెంటనే భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో క్రీజులోకి వచ్చిన స్మిత్తో వార్నర్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో 31 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువలో వార్నర్ క్యాచ్ ఔటవ్వగా.. స్టోయినిస్తో కలిసి స్మిత్ మ్యాచ్ను ముగించాడు.
అంతకు ముందు బ్యాటింగ్కి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ పీతమ్ నిశాంక (7) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక.. మరో ఓపెనర్ కుశాల్ పెరీరాతో కలిసి వేగంగా ఆడాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక స్కోరు 53/1 గా ఉంది. దాటిగా ఆడుతున్న క్రమంలో ఆడమ్ జంపా వేసిన పదో ఓవర్లో అసలంక.. స్మిత్కి చిక్కి పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లోనే కుశాల్ పెరీరా కూడా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి అవిష్క ఫెర్నాండో (4), వాణిందు హసరంగ (4), దసున్ శనక (12) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన భానుక రాజపక్సే వేగంగా ఆడాడు. చమిక కరుణ రత్నే (9) పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక మోస్తరు పరుగులు చేయగలిగింది.