
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో తడబడినా.. ఆ తర్వాత చెలరేగిన లంక బ్యాటర్లు జట్టుకు కావాల్సిన 158 పరుగుల టార్గెట్ సెట్ చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది.
పాతుమ్ నిస్సంక(45 బంతుల్లో 2 ఫోర్లతో 40), చరిత్ అసలంక(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్), ధనంజయ డిసిల్వా(23 బంతుల్లో 3 ఫోర్లతో 26) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు.
పిచ్ నుంచి లభించిన సహకారంతో ఆసీస్ బౌలర్లు చెలరేగగా..లంక బ్యాటర్లు తడబడ్డారు. దాంతో తొలి 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఇక చివర్లో చరిత్ అసలంక ధాటిగా ఆడటంతో శ్రీలంక 150 పరుగుల మార్క్ అందుకుంది. ముఖ్యంగా కమిన్స్ వేసిన చివరి ఓవర్లో అసలంక 20 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత ఫీల్డింగ్తో అదరగొట్టింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్తో 20 పరుగులు సేవ్ చేశాడు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కుశాల్ మెండీస్ను కమిన్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా(23 బంతుల్లో 3 ఫోర్లతో 26)తో కలిసి పాతుమ్ నిస్సంక(40) ఇన్నింగ్స్ను ముందుకునడిపించాడు. రెండో వికెట్కు 69 పరుగులు జోడించిన అనంతరం వార్నర్ సూపర్ క్యాచ్కు డిసిల్వా పెవిలియన్ చేరాడు. ఆ కొద్ది సేపటికే పాతుమ్ నిస్సంక రనౌటవ్వగా.. క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(7), డసన్ షనక(3), హసరంగ(1) విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కరుణరత్నే(14 నాటౌట్) సహకారంతో అసలంక చెలరేగాడు.