పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అడిలైడ్ వేదికగా వన్డే మ్యాచ్ గెలిచింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్(5/29) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. షాహిన్ షా అఫ్రిది(3/26) మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్ తలో వికెట్ తీసారు.

అనంతరం పాకిస్థాన్ 26.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 169 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(71 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 82), అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఐదు వికెట్లతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన హారిస్ రౌఫ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అడిలైడ్ వేదికగా పాకిస్థాన్ 28 ఏళ్ల క్రితం 1996లో విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ వేదికపై గెలుపొందింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్కు ఈ విజయం ఊరటనివ్వనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఆదివారం పెర్త్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు సిరీస్ వరించనుంది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. బ్యాటింగ్లో వైఫల్యమే కొంపముంచిందన్నాడు. పాక్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారని, అయితే తాము కాస్త మెరుగైన స్కోరు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. అటాకింగ్ బౌలింగ్, ఫీల్డింగ్తో స్కోరును కాపాడుకోవడానికి ప్రయత్నించామని, కానీ అది జరగలేదని తెలిపాడు.
ఇక మూడో వన్డే సారథ్య బాథ్యతలు జోష్ ఇంగ్లిస్కు అప్పగిస్తున్నానని, భారత్తో టెస్టు సిరీస్కు సన్నదమయ్యేందుకు చివరి మ్యాచ్కు దూరమవుతున్నానని చెప్పాడు. నవంబర్ 22 నుంచి మొదలయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మెరుగైన ప్రాక్టీస్ చేస్తామని అన్నాడు.