ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్ను 2-1తో గెలుచుకున్న పాకిస్థాన్.. మూడు టీ20ల సిరీస్లో మాత్రం 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది.
సోమవారం ముగిసిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు మార్కస్ స్టోయినీస్(27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 61 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో ఆసీస్ గెలుపొందింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజామ్(28 బంతుల్లో 4 ఫోర్లతో 41) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్డీ(3/21) మూడు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా(2/11), స్పెన్సర్ జాన్సన్(2/24) రెండేసి వికెట్లు తీసారు. గ్జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో 3 వికెట్లకు 118 పరుగులు చేసి 52 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. మార్కస్ స్టోయినీస్తో పాటు జోష్ ఇంగ్లీస్(24 బంతుల్లో 4 ఫోర్లతో 27) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, జహందాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది తలో వికెట్ తీసారు.