సొంతగడ్డపై పాకిస్థాన్తో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మూడు టీ20ల సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి టీ20లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 7 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లకు 93 పరుగుల భారీ స్కోర్ చేసింది.
విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్(19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 43), మార్క్స్ స్టోయినీస్ (7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 21 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(9), టీమ్ డేవిడ్(10) విఫలమైనా.. మ్యాక్సీ, స్టోయినీస్ విధ్వంసకర బ్యాటింగ్తో భారీ స్కోర్ అందించారు.

పాకిస్థాన్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హారీస్ రౌఫ్, నసీమ్ షా తలో వికెట్ తీసారు. అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 7 ఓవర్లలో 9 వికెట్లకు 64 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, ఇర్ఫాన్ ఖాన్ డకౌటవ్వగా.. సహిబ్జాదా ఫర్హాన్(8), బాబర్ ఆజామ్(3), ఉస్మాన్ ఖాన్(4), సల్మాన్ అఘా(4) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అబ్బాస్ అఫ్రిది(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్), హసీబుల్లా ఖాన్(8 బంతుల్లో ఫోర్, సిక్స్తో 12), షాహిన్
షా అఫ్రిది(6 బంతుల్లో సిక్స్తో 11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్జేవియర్ బార్ట్లెట్(3/13), నాథన్ ఎల్లిస్(3/9) మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. స్పెన్సన్ జాన్సన్కు ఓ వికెట్ దక్కింది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు మ్యాక్సీ విధ్వంసకర బ్యాటింగ్తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడిన అతన్ని ఈ సారి రిటైన్ చేసుకోలేదు. వేలంలో మ్యాక్సీ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ ఆర్టీఎమ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయవచ్చు.