
అడిలైడ్: క్రికెట్ మ్యాచ్లను చూసేందుకు వచ్చే అభిమానులు తమ ప్లకార్డులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. గతంలో ఓ అమ్మాయి.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసే వరకు పెళ్లి చేసుకోనని ప్లకార్డు చూపించి వార్తల్లో నిలిచింది. తాజాగా అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా చోటు చేసుకుంది. మ్యాచ్ సీరియస్గా జరుగుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీలోనే ఓ చిన్నారి.. 'వార్నర్ నాకు నీ టీషర్ట్ కావాలి.. ఇస్తావా?'అని ప్లకార్డు ప్రదర్శించాడు.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 134) ఒక్కడే సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలలో ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 4 వికెట్లకు 291 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 86), ట్రావిస్ హెడ్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవ్ స్మిత్(78 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు.