టీ20 ప్రపంచకప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియాతో శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ అనూహ్య పరాజయం ఇంగ్లండ్ సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
చివరి రెండు లీగ్ మ్యాచ్లు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి తెచ్చుకొంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. విల్ జాక్స్తో రెండో ఓవర్ బౌలింగ్ చేయించడం తమ కొంప ముంచిందని చెప్పాడు. అక్కడే మూమెంటమ్ మారిపోయిందని, ఆసీస్ భారీ స్కోర్ చేయడానికి పునాది పడిందన్నాడు.

బెడిసికొట్టిన ప్రయోగం..
'విల్ జాక్స్తో బౌలింగ్ చేయించడం సాహసోపేత నిర్ణయం. కానీ మా వ్యూహం బెడిసి కొట్టింది. ఇద్దరు లెఫ్టార్మ్ బ్యాటర్లు క్రీజులో ఉండటంతో విభిన్న నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం. రెండు ఓవర్లను స్పిన్నర్లతో వేయించాలని భావించాం. మొయిన్ అలీ తొలి ఓవర్ను అద్భుతంగా వేసాడు. ఐపీఎల్లో అతను చాలా సార్లు ఈ పాత్రను పోషించాడు.
దాంతోనే నేను ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాను. మొయిన్ అలీ అద్భుతంగా వేయడంతో విల్ జాక్స్కు రెండో ఓవర్ ఇచ్చాను. కానీ ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతమైన షాట్స్ ఆడారు. షార్ట్ బౌండరీలవైపు బంతిని తరలించి పరుగులు పిండుకున్నారు. ఈ టోర్నీలో ప్రస్తుతం మా పరిస్థితి ఏందో మాకు తెలుసు.
ఆసీస్ బాగా ఆడింది..
ఈ ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో తదుపరి మ్యాచ్కు సిద్దమవుతాం. మంచి క్రికెట్ ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఆ సామర్థ్యం మా జట్టుకు ఉంది. ఆస్ట్రేలియాతో మేం చెత్త ప్రదర్శన చేశాం. ఈ విజయానికి ఆ జట్టు ఆటగాళ్లు పూర్తి అర్హులు. మా కంటే మెరుగైన ప్రదర్శన చేశారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా పేసర్లు నిలకడగా బౌలింగ్ చేశారు. లాంగ్ సైడ్ బౌండరీ వైపు ఆడేలా మాకు బంతులు సంధించారు. జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లండ్ తొలి ఓవర్ను మొయిన్ అలీకి ఇచ్చింది. అతను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 3 పరుగులే ఇచ్చాడు.
కొంపముంచిన విల్ జాక్స్..
దాంతో జోస్ బట్లర్ విల్ జాక్స్ను రంగంలోకి దింపగా.. ట్రావిస్ హెడ్ రెండు సిక్స్లు, డేవిడ్ వార్నర్ ఓ సిక్స్ బాది 22 పరుగులు పిండుకున్నారు. దాంతో మూమెంటమ్ అంతా ఆసీస్ వైపు మళ్లింది. అక్కడి నుంచి ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి 201 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 6 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది.