
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ గెలిచి జోరు మీదున్న ఇంగ్లండ్కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. స్టీవ్ స్మిత్(78 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 86), ట్రావిస్ హెడ్ (57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీలతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే శనివారం సిడ్నీ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 134) ఒక్కడే సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. డేవిడ్ విల్లే(34 నాటౌట్), జోస్ బట్లర్(29) కాస్త పర్వాలేదనిపించారు.
31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను మలాన్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో పాతుకుపోయి జట్టుకు కావాల్సిన స్కోర్ అందించాడు.ఆసీస్ బౌలర్లలలో ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 86), ట్రావిస్ హెడ్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించారు. తొలి వికెట్కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మార్నస్ లబుషేన్ విఫలమైనా.. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ(21), కామెరూన్ గ్రీన్(20 నాటౌట్)ల సహకారంతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.