
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ అవమానకర రితీలో ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. టీ20 ప్రపంచకప్ కోసం ఇక్కడికి వచ్చిన ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది. కానీ మూడు వన్డే సిరీస్లో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. మూడు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి క్లీన్ స్వీప్కు గురైంది.
అసలు ప్రపంచ విజేతేనా ఆడుతున్నట్లు అనిపించింది. తీరిక లేని షెడ్యూలో లేక భిన్నమైన ఫార్మాటో తెలియదు కానీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 221 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు 48 ఓవర్లకు కుదించి ఆడించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 48 ఓవర్లలో 5 వికెట్లకు 355 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్లతో 152), డేవిడ్ వార్నర్(102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 106) సెంచరీలతో రాణించారు. ఈ సెంచరీతో వార్నర్ రెండున్నరేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్ ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. జాసన్ రాయ్(33), జేమ్స్ విన్స్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/31) నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్ రెండేసి వికెట్లు తీసారు. జోష్ హజెల్ వుడ్, మిచెల్ మార్ష్లకు తలో వికెట్ లభించింది. ఈ విజయంతో ఆసీస్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. సెంచరీ హీరో ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. డేవిడ్ వార్నర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది.
మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. లక్ష సీట్ల సామర్థ్యం కలిగిన ఈ మైదానంలో కనీసం 10 వేల మంది కూడా ఈ మ్యాచ్కు హాజరు కాలేదు. ప్రేక్షకులు రాకపోవడానికి వర్కింగ్ డే ప్రధాన కారణమైతే.. వన్డే క్రికెట్ను లైట్ తీసుకోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానం ఖాళీగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.