
దుబాయ్: ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఇరు జట్లను ఊరించిన విజయం చివరకు వికెట్ తేడాతో పాకిస్థాన్ను వరించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ బ్యాటర్ అసిఫ్ అలీ, అఫ్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ గొడవపడ్డారు. క్రికెట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొట్టుకోవడానికి సిద్దమయ్యారు. అసిఫ్ అలీ ఏకంగా తన బ్యాట్ను ఫరీద్ అహ్మద్పైకి ఎత్తి బెదిరించాడు.
అసిఫ్ ఆలీ వికెట్ తీసిన ఆనందంలో ఫరీద్ అహ్మద్ బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దాన్ని తట్టుకోలేకపోయిన పాక్ క్రికెటర్, తన బ్యాటు ఎత్తి ఫరీద్ అహ్మద్ని కొట్టేందుకు ప్రయత్నించాడు. అసిఫ్ ఆలీ బెదిరింపులకు ఏ మాత్రం భయపడని ఫరీద్ అహ్మద్, కదలకుండా ధీటుగా బదులిచ్చాడు.
ఈ ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటుండగా అంపైర్, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అయితే ఈ ఘటనలో అసిఫ్ అలీదే తప్పు అని టీవీ రిప్లే చూస్తే అర్థమైంది. వికెట్ తీసిన సంతోషంలో బౌలర్లు అతి చేయడం సర్వ సాధారణం. కానీ మ్యాచ్ కీలక సమయంలో ఔటవ్వడాన్ని అసిఫ్ అలీ తట్టుకోలేక హద్దులు ధాటాడు. దాంతో అంతా అతనిదే తప్పని భావించారు.
అతన్ని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని కోరుతూ '#BanAsifAli' హ్యాష్ ట్యాగ్ను కూడా ట్రెండ్ చేశారు. అయితే ఐసీసీ మాత్రం ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పిదమని తేల్చింది. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రవర్తించకుండా.. ఫరీద్ అహ్మద్, పాక్ క్రికెటర్ అసిఫ్ ఆలీలకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు చెరో డీ మోరిట్ పాయింట్ వేసింది.
ఈ మ్యాచ్లో 118 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అయితే ఆఖరి ఓవర్లో నసీం షా వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్ని ముగించాడు. గ్రూప్ స్టేజీలో అద్భుత విజయాలు అందుకున్న అఫ్గాన్, భారత్.. సునాయసంగా ఫైనల్ చేరుతాయని అంతా అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాకిస్థాన్, శ్రీలంక ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్లో తలపడనున్నాయి. టాస్ మ్యాచ్ ఫలితాలను శాసించింది.