న్యూఢిల్లీ: ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా పాల్గొనే విషయంపై జూలై 7న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జౌ నగరంలో ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్లో క్రికెట్ను కూడా భాగం చేశారు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు టీమిండియా ససేమిరా అన్నది.
2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా... టీమిండియా పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్లను పంపించలేదు. కానీ భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణిని పంపించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్లో సత్తా చాటిన రింకూ సింగ్, తిలక్ వర్మలతో పాటు ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసి చైనాకు పంపించాలని భావిస్తోంది. ఈ విషయంపై జూలై 7న జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏషియన్ గేమ్స్లో పాల్గొనడంతో పాటు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటంపై కూడా ఓ పాలసీని రూపొందించాలనే విషయంపై కూడా చర్చించనున్నారు.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్తో పాటు భారత క్రికెట్కు గుడ్బై చెప్పిన అంబటి రాయుడు.. వెంటనే అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ బరిలోకి దిగాడు. ఇది ఇలానే కొనసాగితే చాలా మంది ఆటగాళ్లు విదేశీ లీగ్స్ కోసం ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే భారత క్రికెట్కు గుడ్బై చెప్పినా కొంత కాలం వరకు విదేశీ లీగ్స్ ఆడే ఆస్కారం లేకుండా చేయాలనే యోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలతో పాటు బీసీసీఐ హోమ్ సీజన్ టీవీ బ్రాడ్కాస్టర్, జెర్సీ స్పాన్సర్షిప్ టెండర్ ప్రక్రియల గురించి కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం టీమిండియా హోమ్ సీజన్కు టీవీ బ్రాడ్కాస్టర్ లేడు. జెర్సీ స్పాన్సర్గా బైజూస్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్ను ఖారారు చేయనున్నారు. అలాగే అప్కమింగ్ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను అమలు చేయడంపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు.