హంగ్జౌ: ఆసియా గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మలేషియాతో గురువారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే మలేషియా కంటే భారత జట్టు ర్యాంక్ మెరుగ్గా ఉండటంతో సెమీఫైనల్ బెర్త్ దక్కింది.
ఆదివారం పాకిస్థాన్ జట్టుతో భారత్ సెమీఫైనల్-1 ఆడే అవకాశం ఉంది. మరికాసేపట్లో ఇండోనేషియా మహిళలతో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ మహిళల టీమ్ విజయం సాధిస్తే.. సెమీఫైనల్ చేరుతుంది. ఓడితే మాత్రం ఇండోనేషియా సెమీ ఫైనల్ చేరుతుంది.

భారత్- మలేషియా మధ్య జరిగిన మ్యాచ్ను వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. షెఫాలీ వర్మ(39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ నిర్ణీత 15 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసింది.
షెఫాలీకి తోడుగా జెమీమా రోడ్రిగ్స్(29 బంతుల్లో 6 ఫోర్లతో 47 నాటౌట్), రిచా ఘోష్(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. స్మృతి మంధాన(16 బంతుల్లో 5 ఫోర్లతో 27) కూడా పర్వాలేదనిపించింది. మలేషియా బౌలర్లలో మహిరా ఇజ్జాతీ ఇస్మాయిల్, మాస్ ఎలిసా తలో వికెట్ తీసారు.
అనంతరం మలేషియా బ్యాటింగ్ ప్రారంభించగా వర్షం అంతరాయం కలిగించింది. 2 బంతుల్లో మలేషియా 1 పరుగే చేసింది. వర్షం ఎంతకు తగ్గకుపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేసి చేరో పాయింట్ కేటాయించారు.