న్యూఢిల్లీ: ఏషియన్ గేమ్స్ 2023లో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు పురుషుల టీమ్ కూడా బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జౌ నగరంలో ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్లో క్రికెట్ను కూడా భాగం చేశారు. ఏషియన్ గేమ్స్లో రెండు సార్లు మాత్రమే క్రికెట్కు అవకాశం ఇచ్చారు.
2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ను భాగం చేసినా.. టీమిండియా ఇప్పటి వరకు పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్లను పంపించలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆసియా క్రీడల్లో తమ జట్లు పాల్గొనలేవని తెలిపింది. ఈ ఏడాది కూడా ఆసియాకప్తో పాటు వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీలో భాగం కాలేమని బీసీసీఐ చెప్పింది.

కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మహిళల జట్టు కూడా ఈ టోర్నీలో పాల్గొననుంది. జూన్ 30లోపు భారత ఒలింపిక్ అసోసియేషన్కు బీసీసీఐ తమ ఆటగాళ్ల జాబితాను పంపనున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
'ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషుల, మహిళల జట్టు పాల్గొనబోతుంది. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి టీమ్ను బరిలోకి దించాలని నిర్ణయించాం. త్వరలోనే భారత ఒలింపిక్ సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తాం.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
మరోవైపు ఏషియన్ గేమ్స్ మిషన్ చీఫ్ భూపెందర్ భజ్వా మాత్రం బీసీసీఐ నుంచి స్పష్టమైన సమాచారం రాలేదన్నాడు. 'ఆసియా క్రీడల్లో భారత్, ఒక్క క్రికెట్ తప్ప అన్ని ఈవెంట్స్లో పాల్గొనబోతోంది. బీసీసీఐకి ఇప్పటికే చాలాసార్లు మెయిల్స్ పంపించాం. అయితే ఆ సమయంలో బిజీ షెడ్యూల్ ఉండడంతో టీమ్స్ని పంపలేమని మాకు చెప్పారు.'అని ఆయన తెలిపాడు.