పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ టీమ్ ఫైనల్ చేరింది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 4-1తో సౌత్ కొరియాను చిత్తు చేసింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్(19వ నిమిషం, 45వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. ఉత్తమ్ సింగ్(14వ నిమిషం), జర్మన్ప్రీత్ సింగ్(33వ నిమిషం) చెరొక గోల్ చేశారు. కొరియా తరఫున యంగ్-జి-హన్(34వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు.
ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. ప్రత్యర్థి సౌత్ కొరియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడులు చేసింది.

ఖాతా తెరిచిన ఉత్తమ్ సింగ్..
తొలి క్వార్టర్లోనే ఉత్తమ్ సింగ్ రైట్ వింగ్ నుంచి బంతిని అద్భుతంగా గోల్ పోస్ట్లోకి పంపించి భారత్ ఖాతా తెరిచాడు. సెకండ్ క్వార్టర్ ప్రారంభంలోనే భారత్కు పెనాల్టీ కార్నర్ లభించగా.. స్పెషలిస్ట్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు.
ఫస్టాఫ్ చివర్లో కొరియా గోల్ చేసే ప్రయత్నం చేయగా.. భారత డిఫెన్స్ విభాగం అద్భుతంగా అడ్డుకుంది. భారత డీ ఏరియా నుంచి కొరియా ప్లేయర్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్లోకి వెళ్లలేదు. దాంతో ఫస్టాఫ్ 2-0తో ముగిసింది.
లాంగ్ స్విచ్తో..
సెకండాఫ్ ప్రారంభంలోనే లాంగ్ స్విచ్తో జర్మన్ప్రీత్ సింగ్ బంతిని గోల్ పోస్ట్లోకి పంపించి భారత్ ఆధిక్యాన్ని మూడింతలు చేశాడు. ఆ మరుక్షణమే కొరియాకు లభించిన పెనాల్టీ కార్నర్ను యంగ్ జి హన్ గోల్గా మలిచి ఆధిక్యాన్ని 3-1కి తగ్గించాడు. ఆ తర్వాత కొరియా గోల్స్ కోసం ప్రయత్నించగా.. భారత్ గేమ్ను తమ నియంత్రణలో ఉంచుకుంది.
మూడో క్వార్టర్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచి 4-1తో భారత విజయాన్ని ఖాయం చేశాడు. చివరి క్వార్టర్లో ఇరు జట్లు పోరాడినా గోల్స్ నమోదు కాలేదు.
చైనాతో టైటిల్ ఫైట్..
మంగళవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఆతిథ్య చైనాతో తలపడనుంది. సెమీఫైనల్-2లో పాకిస్థాన్ను చైనా మట్టికరిపించింది. ఈ టోర్నీలో చైనాపై 3-0, జపాన్పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1, పాక్పై 2-1తో వరుసగా 6 మ్యాచ్ల్లో విజయం సాధించిన భారత్.. అజేయంగా టైటిల్ ఫైట్కు సిద్దమైంది.