హైదరాబాద్: ఆసియాకప్ 2023కి రంగం సిద్దమైంది. మరో 13 రోజుల్లో 16వ ఎడిషన్కు తెరలేవనుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లతో పాటు ఈ సారి కొత్తగా నేపాల్ ఈ టోర్నీకి అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ గ్రూప్-బిలో ఉన్నాయి.
ఇరు గ్రూప్స్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధించనుండగా.. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడనున్నాయి. ఈ సారి టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్కు ఉండగా.. అక్కడికి వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరించింది. చివరకు యూఏఈ వేదికగా భారత్ మ్యాచ్లు నిర్వహించి.. మిగతా మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించుకుంటామని కోరినా వినలేదు.

ఈ హైబ్రీడ్ మోడల్ను ఇతర దేశాలు వ్యతిరేకించాయి. ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటాయని తెలిపాయి. చివరకు ఏసీసీ అనేక సమావేశాల అనంతరం శ్రీలంకతో సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. కొన్ని మ్యాచ్లు మాత్రమే పాక్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. మెజార్టీ మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి.
భారత్తో వైరం కారణంగానే పాకిస్థాన్ ఆసియాకప్ 2023 టోర్నీకి అతిథ్యం ఇవ్వలేకపోయింది. 29 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో పాకిస్థాన్ ఒకే ఒకసారి ఆతిథ్యం ఇచ్చింది. భారత్ కూడా కేవలం ఒకసారి మాత్రమే ఆతిథ్యం ఇచ్చినా.. టోర్నీ నిర్వహణలో పెత్తనం చెలాయించింది.
ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఐదేసి సార్లు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా.. శ్రీలంక నాలుగు సార్లు ఆతిథ్యం ఇచ్చింది. తాజా టోర్నీతో బంగ్లాదేశ్ సరసన నిలిచింది.
1984లో యూఏఈ వేదికగా తొలి ఎడిషన్ జరగగా.. 1986 ఎడిషన్ శ్రీలంక వేదికగా జరిగింది. శ్రీలంకతో ఉన్న విభేదాలతో ఈ టోర్నీని భారత్ బహిష్కరించింది. 1988 టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వగా.. 1990-91 టోర్నీని భారత్ నిర్వహించింది. బంగ్లాదేశ్ 1988, 2000, 2012, 2014, 2016, 2018 టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చింది. 2012, 2016, 2018 టోర్నీల్లో ఫైనల్ చేరిన ఆ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది.
2008 ఎడిషన్కు మాత్రమే పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా.. శ్రీలంక 1986, 1997, 2004, 2010 టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ నాలుగు టోర్నీల్లో మూడుసార్లు ఆ జట్టు విజేతగా నిలవడం గమనార్హం.