ఆసియా కప్ 2025 ఫైనల్లోనూ భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అంతేకాకుండా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో కలిసి ట్రోఫీ ఫొటో షూట్లోనూ పాల్గొనలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టాస్ సమయంలో ఇద్దరు ప్రజెంటర్స్ కనిపించారు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్థాన్ కెప్టెన్తో ఆ జట్టు మాజీ పేసర్ వకార్ యూనిస్ మాట్లాడాడు. ఇద్దరు కెప్టెన్లకు ఇద్దరు ప్రజెంటర్స్ ఉండటం విచిత్రంగా అనిపించింది. పాకిస్థాన్ జట్టు రిక్వెస్ట్తోనే బ్రాడ్కాస్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తటస్థ ప్రజెంటర్ను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్)ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఇద్దరు ప్రజెంటర్స్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విజయానంతరం టీమిండియా ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే విషయాన్ని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ పరోక్షంగా వెల్లడించాడు.

అంతేకాకుండా ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా అండగా ఉంటుందని, సంఘీభావం కూడా తెలిపాడు. ఐసీసీ, ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నామనే విషయాన్ని తన మాటల ద్వారా సూర్య స్పష్టం చేశాడు.
అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్థాన్.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఐసీసీ పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన సూపర్-4 మ్యాచ్లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేయలేదు. తాజాగా ఫైనల్లోనూ ఇదే సీన్ రీపిట్ అయ్యింది. సంప్రదాయం ప్రకారం ఫైనల్ మ్యాచ్కు ముందు ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫొటో షూట్ ఉంటుంది. ఈ ఫొటో షూట్ను కూడా భారత్ బాయ్కట్ చేసింది. దానికి నిరసనగానే పాకిస్థాన్ రెండో ప్రజెంటర్గా తమ దేశానికి చెందిన ఆటగాడిని పెట్టాలని డిమాండ్ చేసినట్లు అర్థమవుతుంది. వాస్తవానికి లీగ్, సూపర్-4 మ్యాచ్ల్లో ఒకే ప్రజెంటర్ ఉన్నాడు.