ఆసియా కప్ 2025 టోర్నీలో శ్రీలంక శుభారంభం చేసింది. బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో వానిందు హసరంగా (2/25), బ్యాటింగ్లో పాతుమ్ నిస్సంక(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. జాకెర్ అలీ(34 బంతుల్లో 2 ఫోర్లతో 41), షమీమ్ హొస్సేన్(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా(2/25) రెండు వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దుష్మంత్ చమీరా చెరో వికెట్ తీసారు. కెప్టెన్ లిటన్ దాస్(28)తో పాటు మెహ్దీ హసన్(9)ను పెవిలియన్ చేర్చి హసరంగా మ్యాచ్ను మలుపు తిప్పాడు.

అనంతరం శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కమిల్ మిషార(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి ధాటికి 32 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక లక్ష్యాన్ని చేధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్(2/29) రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ షకీబ్ చెరో వికెట్ పడగొట్టారు.