ఆసియా కప్ 2025 టోర్నీలో ఆతిథ్య యూఏఈ ఖాతా తెరిచింది. పసికూన ఒమన్తో సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన యూఏఈ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న యూఏఈ అద్భుత విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. అలిషన్ షరఫు(38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 51), కెప్టెన్ ముహమ్మద్ వసీం(54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముహమ్మద్ జోహైబ్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21), హర్షిత్ కౌషిక్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 19 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితెన్ రమనంది (2/24) రెండు వికెట్లు తీయగా.. హస్నైన్ షా, సామ్య శిరవస్తవా చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఒమన్ 18.4 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. జతిందర్ సింగ్(20), ఆర్యన్ బిస్త్(24), వినాయక్ శుక్లా(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖ్(4/23) నాలుగు వికెట్లు తీయగా.. హైదర్ అలీ(2/22), ముహమ్మద్ జవదుల్లా(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. ముహమ్మద్ రోహిద్ ఒక వికెట్ తీసాడు. ఈ ఓటమితో ఒమన్.. సూపర్ 4 రేసు నుంచి నిష్క్రమించింది.

గ్రూప్-ఏలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన భారత్ అగ్రస్థానంలో నిలిచి సూపర్ 4 బెర్త్ను ఖరారు చేసుకుంది. ఒమన్తో జరిగే ఆఖరి మ్యాచ్లో భారత్ ఓడినా మెరుగైన రన్రేట్ కారణంగా సూపర్-4 చేరుతుంది. ఒమన్పై భారీ విజయం సాధించి.. భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. యూఏఈతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిస్తేనే పాకిస్థాన్ టోర్నీలో ముందడుగు వేస్తోంది. అలా కాకుండా యూఏఈ చేతిలో ఓడితే మాత్రం పాక్ లీగ్ దశలోనే నిష్క్రమిస్తోంది. అప్పుడు యూఏఈ సూపర్-4కు చేరుకుంటుంది. ప్రస్తుతం పాకిస్థాన్ డేంజర్ జోన్లో ఉంది.