ఆసియా కప్ 2025 టోర్నీ సూపర్-4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. శ్రీలంకతో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్లో సత్తా చాటిన బంగ్లాదేశ్.. అనంతరం బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. డసన్ షనక(37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండీస్(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 34), పాతుమ్ నిస్సంక(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/20) మూడు వికెట్లు తీయగా.. మెహ్ది హసన్(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసాడు.

అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ సైఫ్ హసన్(45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 61), టౌహిడ్ హృదయ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/22), డసన్ షనక(2/21) రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దుష్మంత చమీరా ఒక వికెట్ పడగొట్టాడు.
ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. జాకెర్ అలీ బౌండరీ బాది స్కోర్లను సమం చేశాడు. అయితే మరుసటి బంతికే అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మెహ్దీ హసన్ ఓ బంతిని డాట్ చేసి మరుసటి బంతికి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో చివరి 2 బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగుల అవసరమైంది. కానీ క్రీజులోకి వచ్చిన షమీమ్ హొస్సేన్(1) ఎలాంటి తప్పిదం చేయకుండా సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.