ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టుపై సస్పెన్స్ వీడింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించాడు. సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతుందని స్పష్టం చేశాడు. సూర్యకు శుభ్మన్ గిల్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని తెలిపాడు.
శుభ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మకు చోటు దక్కింది. అయితే ఈ 15 మంది ఆటగాళ్లలో తుది జట్టులో ఆడే ఆటగాళ్లు ఎవరా? అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఎవరికి మొండి చెయ్యి ఎదురవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఓ ముగ్గురు ఆటగాళ్లు టోర్నీ మొత్తం బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురు టోర్నీ ఆసాంతం.. వాటర్ బాయ్స్గానే జట్టుకు సేవలందించనున్నారు. ఆ ఆటగాళ్లు ఎవరు తెలుసుకుందాం.

టీమిండియా ఫినిషర్గా జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మిడిలార్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నారు. ఎక్స్ట్రా బ్యాటర్ను ఆడించినా స్పిన్ బాగా ఆడే శివమ్ దూబే, సంజూ శాంసన్లకే చోటు దక్కనుంది. ఈ క్రమంలోనే రింకూ సింగ్ టోర్నీ అసాంతం బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. పైగా అతను ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2025లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు.
మూడో పేసర్గా భారత జట్టులో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా వారికి అండగా పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలో భారత్ ఒకరు లేదా ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతోనే బరిలోకి దిగనుంది. ఎక్కువగా స్పిన్ బౌలింగ్పైనే ఆధారపడనుంది. ఈ క్రమంలోనే హర్షిత్ రాణాకు మొండి చెయ్యే ఎదురవ్వనుంది.
పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా జట్టులోకి వచ్చిన శివమ్ దూబేకు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. హార్దిక్ గాయాల బారిన పడితే తప్పా శివమ్ దూబేకు చోటు దక్కే ఛాన్స్ లేదు. ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటర్గా అతన్ని పరిగణలోకి తీసుకుంటేనే శివమ్ దూబే బరిలోకి దిగుతాడు. లేదంటే అతను పూర్తిగా బెంచ్కే పరిమితమవుతాడు.